హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/నందిపేట్: అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి, దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మాడల్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్తో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న కంధార్ -లోహాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు లక్షమందికిపైగా జనం తరలిరానున్నారని చెప్పారు. కేసీఆర్ రాక కోసం మరాఠీలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాందా ర్ లోహా సభ ద్వారా తెలంగాణ మాడల్ ఆవిష్కృతమవుతుందని అన్నారు. కేసీఆర్ది దేశానికి అన్నం పెట్టే మాడల్ అయితే, మోదీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే రకమని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకమని ఆయన అభివర్ణించారు. ఆదర్శవంతమైన తెలంగాణ మాడల్ తమ రాష్ట్రంలోనూ అమలు జరగాలన్నది మహారాష్ట్ర ప్రజల మనోగతమని తెలిపారు. సంపూర్ణ మద్దతు తెలిపి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరడానికి కేసీఆర్ రాక కోసం మహారాష్ట్ర ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం చేస్తున్న విస్తృత ఏర్పాట్లకు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నాని అన్నారు. కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు మరాఠీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు మానిక్ కదం, బీఆర్ఎస్ నేత లు జాకీర్ చౌస్, హరిసింగ్ రాథోడ్, ప్రవీణ్, జితేవాడ్, సుధాకర్ చౌహాన్ పాల్గొన్నారు.