హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 114 ప్రభుత్వ బడుల్లో కొత్తగా 252 తరగతి గదులను నిర్మించనున్నారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఒక్కో అదనపు తరగతి గదిని రూ. 13.50లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు గతంలోనే పలు స్కూళ్లను ఎంపికచేశారు. అయితే, కొన్ని కారణాలతో వీలుపడకపోగా, వాటి స్థానంలో కొత్త వాటికి చోటుకల్పించారు. ఈ తరగతుల నిర్మాణానికి రూ. 34.02 కోట్ల నిధులను మంజూరుచేశారు. టెండర్లు సహా నిర్మాణ బాధ్యతలను టీఎస్ఈడబ్ల్యూఐడీసీకి అప్పగించారు.
పీఎం శ్రీలో భాగంగా బడుల్లో సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఒక్కో బడిలో ప్రత్యేక తరగతి గదిని నిర్మించనున్నారు. 229 బడుల్లో ఒకటి చొప్పున 229 ల్యాబ్ గదులను నిర్మిస్తారు. వీటిని కూడా రూ. 13.50 లక్షల వ్యయంతో నిర్మించనుండగా, రూ. 30.91 కోట్లను మంజూరుచేశారు.