జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లిలో రూ. 312 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లికి రూ.25 కోట్ల పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. కేసీఆర్ దయ వల్లే భూపాలపల్లి బాగుపడ్డదని తెలిపారు. ఒకప్పుడు భూపాలపల్లికి రావాలంటేనే భయపడేవాళ్లం.. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో భూపాలపల్లి అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రతి ఒక్కరం గతాన్ని, ప్రస్తుతానికి సమీక్షించుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని దయాకర్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అని పేర్కొన్నారు. జైలుకు పోయి వచ్చిన దొంగల మాటలు విందామా..? ప్రజల కోసం జైలుకు పోయిన పోరాటయోధుల మాటలు విందామా..? అని దయాకర్ రావు ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూదనచారిని కడుపులో పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని దయాకర్ రావు స్పష్టం చేశారు.