హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): సర్కారు భూమి వేలంపాటకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని 64.93 ఎకరాల ప్రభుత్వ భూమికి వేలం నిర్వహించేందుకు మంగళవారం నోటిఫికేషన్లు జారీచేశాయి. కోకాపేట భూమికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరానికి రూ.25 కోట్ల నుంచి వేలం ప్రారంభమవుతుంది. రెండు ప్రాంతాల్లో కలిపి ఒక ఎకరం నుంచి తొమ్మిది ఎకరాల వరకు వైశాల్యం ఉన్న 13 ప్లాట్లను వేలం వేయనున్నారు. కోకాపేటలోని 8 ప్లాట్లకు హెచ్ఎండీఏ, ఖానామెట్లోని 5 ప్లాట్లకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ-వేలం నిర్వహించనున్నారు.
13 వరకు రిజిస్ట్రేషన్
ప్రభుత్వం భూముల వేలానికి ఈ నెల 25న హెచ్ఎండీఏ, 26న టీఎస్ఐఐసీ ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించనున్నాయి. వేలంలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు జూలై 13వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూలై 15న హెచ్ఎండీఏ, జూలై 16న టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనున్నారు. వేలంలో భాగం గా కోకాపేటలో 49.92 ఎకరాలు, ఖానామెట్లో 15.01 ఎకరాలను ప్లాట్లుగా విక్రయించనున్నారు. ఎంఎస్టీసీ ఈ కామర్స్ డాట్కామ్ ద్వారా ప్లాట్ల కొనుగోలు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేలం, లేఔట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆక్షన్స్ డాట్ హెచ్ఎండీఏ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. కోకాపేటలో అభివృద్ధి చేసిన లేఅవుట్ కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.300 కోట్లు వెచ్చిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను వివిధ వసతుల కోసమే కేటాయించారు. లేఔట్లోని రోడ్లన్నీ 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేస్తున్నారు. కోకాపేట లేఔట్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ.. మార్కెటింగ్ పార్ట్నర్గా సీబీఆర్ఈను నియమించింది.