హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో నగదును స్వాహా చేశారు. ఓ మహిళా వ్యాపారి ఫోన్కు మెసేజ్లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలు కాజేశారు. సైబరాబాద్ సైబ ర్ క్రైం పోలీసుల వివరాల ప్రకారం.. చందానగర్ ప్రాంతానికి చెంది ఓ మహిళ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. దీని కోసం ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడాలో కరెంట్ ఖాతాను నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ఆమె ఫోన్కు కొన్ని గంటల పాటు ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్లు రాలేదు. దీంతో ఆమె ఎయిర్టెల్ స్టోర్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన స్టోర్ ఉద్యోగి ఫోన్ లాక్ అయినట్టు గుర్తించారు. సిమ్ కార్డు సేవలను పునరుద్ధరించగా ఆమె ఫోన్కు 150 మెసేజ్లు వచ్చాయి. అందులో ఓ ఆరు మె సెజ్లలో ఆమె బ్యాంకు ఖాతా నుంచి దాదాపు 24 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్టు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరస్థులు మహిళా వ్యాపారి ఫోన్ను బ్లాక్ చేసి ఆమె ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ మెయిల్ ఓటీపీల తో నగదును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మోసంలో సిమ్ కార్డు ప్రొవైడర్ సంస్థకు చెందిన ఉద్యోగి సహకారం ఉందని కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలిసింది. మోసానికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక సైబర్ క్రైం బృందాలు రంగంలోకి దిగాయి.