హైదరాబాద్ : దేశానికే తెలంగాణ విద్యుత్ ఆదర్శమని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పల్లె, పట్టణం అనే తేడాలేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్ మెట్రోజోన్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల కోసం అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టామని తెలిపారు. సంస్థ పరిధిలో 91 వినియోగదారుల సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని చెప్పారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. కొత్త సర్వీసుల మంజూరు, టైటిల్ ట్రాన్స్ఫర్, అదనపు లోడ్, సరఫరా తదిరత సమస్యలకు ఆన్లైన్లోనే స్వీకరించి, పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదుల పర్యవేక్షణకు డైరెక్టర్ రాములుని ఇన్చార్జిగా నియమించామని పేర్కొన్నారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రూ.18,624 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. కొంతమంది విద్యుత్ సిబ్బంది వ్యవహార శైలితో సంస్థకు చెడ్డపేరు వస్తున్నదని తెలిపారు. వినియోగదారులతో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ వినియోగదారుల పరిషార వేదిక(సీజీఆర్ఎఫ్) 1, 2 చైర్పర్సన్లు జయరాజ్, దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్య తలెత్తినా సీజీఆర్ఎఫ్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు 10 నుంచి 45 రోజుల్లో పరిష్కారానికి సంబంధించి తుదితీర్పు వెల్లడిస్తామని చెప్పారు. ప్రతినెలా క్షేత్రస్థాయిలో డివిజన్ స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ అంబుడ్స్మన్ మహమ్మద్ నిజాముద్దీన్, సంస్థ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జే శ్రీనివాస్ రెడ్డి, కే రాములు, ఎస్ స్వామి రెడ్డి, సీహెచ్ మదన్మోహన్ రావు, జీ గోపాల్, సీజీఎంలు పాండ్య, నరసింహ స్వామి తదితరులు పాల్గొన్నారు.