హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరో 23 రిజర్వాయర్లు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహేశ్వరం, ఇబ్రహీపట్నం, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గాల పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు లోపలి ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ రిజర్వాయర్లను మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఓఆర్ఆర్ ఫేజ్-2లో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో రూ.1,200 కోట్లతో 73 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతం 23 అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్రోడ్డు లోపల 193 గ్రామాలకు మెరుగైన నీటి సరఫరా కోసం రూ.750 కోట్లతో 164 రిజర్వాయర్లు, 1,571 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మించి దాహార్తిని తీర్చుతున్నది.