నిజామాబాద్ : ప్రస్తుత యాసంగి సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల కింద 2,64,832 ఎకరాల్లో సాగయ్యే పంటలకు 23.832 టీఎంసీల నీటిని విడుదలకు నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో ఆమోదించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జడ్పీ చైర్మన్ విట్టల్రావు పాల్గొన్నారు. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవుడి దయ, సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి తీసుకున్నంటున్న పలు నిర్ణయాలు, హరితహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలతో రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి అలుగులు పారాయన్నారు. రెండు జిల్లాల పరిధిలో పంటలకు నీటి విడుదల చేసేందుకు ఎలాంటి రంది లేదని, మంచి భరోసా ఉన్నదన్నారు. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించే విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్నారు. నీరు పుష్కలంగా ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా నీటి విడుదలలో మార్పులు చేయాల్సి వస్తే, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అధికారం చీఫ్ ఇంజినీర్కు ఇచ్చినట్లు చెప్పారు.
పంటల మార్పిడిని ప్రోత్సహించాలి
యాసంగిలో పంటల మార్పు జరిగే అవకాశం ఉన్నందున.. రైతులు ఇతర పంటలు సాగు చేస్తే వారిని ప్రోత్సహించాలని మంత్రి అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 43,242 ఎకరాల ఆయకట్టుకు 4.50 టీఎంసీలు, నిజాంసాగర్ కింద 1,98,280 ఎకరాల ఆయకట్టుకు 16.50 టీఎంసీలు, కౌలాస్ నాలా రామడుగు పోచారం ప్రాజెక్టుల కింద 25,280 ఎకరాలకు 2.832 టీఎంసీలు కలిపి మొత్తం 2,64,832 ఎకరాలలో యాసంగి పంటల సాగుకు 23.832 టీఎంసీలు నీటిని విడుదల చేయడానికి బోర్డు ఆమోదించిందని మంత్రి తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు తడులుగా డిసెంబర్ 15 నుంచి పదిహేను రోజులు నీటిని విడుదల చేస్తూ పది రోజుల విరామం ఇస్తూ 13 ఏప్రిల్ 2022 వరకు విడుదల చేయడానికి, ఎస్సారెస్పీ ద్వారా డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా 18 మే 2022 వరకు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు తడులుగా డిసెంబర్ 18 నుంచి ఏప్రిల్ 18 వరకు, అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా డిసెంబర్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏడు తడుల నీరివ్వనున్నట్లు తెలిపారు. చారం ప్రాజెక్టు ద్వారా జనవరి 1 నుంచి ఏప్రిల్ 20 వరకు తొమ్మిది తడులు, కౌలాస్ నాలా ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 10 నుంచి ఏప్రిల్ 6 వరకు 7 తడులు, రామడుగు ప్రాజెక్టు నుంచి 27 డిసెంబర్ నుంచి ఏప్రిల్ 28 వరకు 7 తడుల నీటిని విడుదల చేయడానికి ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
రైతులు ఆలోచించాలి
యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచించారు. వరి సాగు చేస్తే రైస్ మిల్లర్లతో ముందుగానే ఒప్పందం చేసుకోవాలని, తినడానికి అవసరం మేరకు చేసుకోవాలని, విత్తనాల కోసం సంబంధిత కంపెనీలు తీసుకునే విధంగా ఒప్పందాలుంటే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ రావు, డిప్యూటీ సీఈ అశోక్ కుమార్, కామారెడ్డి సీఈ శ్రీనివాస్, రెండు జిల్లాల ఎస్ఈలు బద్రి నారాయణ, కరుణాకర్, వాసంతి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జడ్పీ సీఈవో గోవింద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.