మహబూబాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘మీరంతా యూజ్ లెస్… మీకు బుద్ధిలేదు, జ్ఞానం అసలే లేదు. ఈ సారి వదిలిపెడుతున్నా. మరోసారి అయితే ఊరుకునేది లేదు’ అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తహసీల్దార్లపై చిందులు తొక్కా రు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మరోసారి ఇలాంటి నిర్లక్ష్యా న్ని సహించేది లేదని, ఎవరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ భూములు, ఇండ్ల జాగలను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధిత జాబితాలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ తప్పులను అధికారులను బదనాం చేసేలా మొదటి నుంచి మాట్లాడుతున్నారు. మరోసారి అదే తరహాలో మాట్లాడారు. నిషేధిత భూముల (22ఏ) జాబితా అంతా అధికారులే చేశారని అన్నారు.
వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై మంత్రి పొంగులేటి సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశం ఆద్యంతం అధికారులదే తప్పు అనేలా మంత్రి పొంగులేటి పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. భూ భారతిపై వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నారని తహసీల్దార్లు, ఆర్డీవోలపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించడమో, తిరస్కరించడమో చేయకుండా పెండింగ్లో పెట్టడం ఏందని కలెక్టర్లతో అన్నారు.
దరఖాస్తుల పరిష్కారంపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నదని చెప్పేందుకు ప్రయత్నించిన ఓ తహసీల్దార్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోతే ఊరుకునేది లేదని ములుగు జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్పై కోపాన్ని ప్రదర్శించారు. భూ వివాదాలపై వచ్చే దరఖాస్తల విషయంలో స్పందించడంలేదని భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ను అక్కడి నుంచి బదిలీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిని సహించేది లేదని స్పష్టంచేశారు. అక్రమాలకు పాల్పడే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఉన్నాయని ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ సభ నిర్వహించారు. మంత్రిని కలిసి పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నవించేందుకు బయలుదేరిన సర్పంచులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గోలి సంధ్య ఆత్మహత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ బస్స్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న వారు అటుగా వస్తున్న మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ ఫొటో కనిపించలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫొటోలు పెట్టేవారు. అధికారిక కార్యక్రమాల్లోని ఫ్లెక్సీల్లోనూ కొన్ని రోజులుగా కొండా సురేఖ ఫొటో ఉండటంలేదు.