హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 2021-22 సంవత్సరానికి ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అశ్వారావుపేట ఫ్యాక్టరీలో సాధించిన 19.22 పామాయిల్ నూనె రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయిల్పామ్ గెలల ధరను నిర్ణయించే ఫార్ములాను ఖరారుచేశారు. ఈ ఫార్ములా 2022 అక్టోబర్ వరకు అమలులో ఉంటుంది. దీనివలన రైతులకు ఈ సంవత్సరం పామాయిల్ గెలలకు మంచి ధర లభించే అవకాశం ఉంటుందని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 2021-22 సంవత్సరానికి రాష్ట్రంలో ఆయిల్పామ్ గెలల ధరను నిర్ణయించే ఫార్ములాపై వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లో సమావేశం జరిగింది. వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరోజిని, ఇతర అధికారులు, ఆయిల్పామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ సాగు చేపడుతూ.. ఏడాదికి 2.38 లక్షల మెట్రిక్ టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ గెలల ధరలు నిర్ణయించడానికి అనువుగా కేంద్రప్రభుత్వం 2013లో ఒక ఫార్ములాను ఖరారు చేసింది. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్లో ధరల ఫార్ములాను నిర్ణయిస్తారు.