కులకచర్ల, మే : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కులకచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలలో రెండు మూడు సార్లు గ్రామ సర్పంచుల ద్వారా జిల్లా పాలనాధికారులతో రిప్యూలు, సమావేశాలు, కాన్ఫరెన్స్లు నిర్వహించడం వలన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. బొంరెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ చాకలి అంజిలయ్య, పంచాయతీ కార్యదర్శి, వార్డుల సభ్యులతో, గ్రామ పెద్దలతో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రగతిలో బొంరెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
అభివృద్ధివైపు అడుగులు..
గ్రామంలో వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మురుగునీటి కాల్వలను ఏర్పాటు చేసి మురుగునీరు రోడ్లపైనే పారకుండా ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజు రోడ్లను శుభ్రం చేయడంతో పాటు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను చేకరిస్తున్నారు.
రూ. 12లక్షలతో వైకుంఠధామం
ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయంతో గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా రూ. 12లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. వైకుంఠధామంలో స్నానాలగదులు, నీటి తొట్టి, ఇతర అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. గ్రామంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు రూ. 2.30లక్షలతో వర్మీకంపోస్టు షెడ్ను నిర్మించారు. ప్రతి రోజు గ్రామంలో తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరిస్తున్నారు. హరితహారంలో పెట్టిన మొక్కలను సంరక్షించేందుకు ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ప్రతి రోజూ మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. రూ. 6లక్షలతో సీసీ రోడ్డును నిర్మించారు. దీంతో ప్రజల ఇబ్బందులు తొలిగాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి ప్రతి రోజు నిటిని అందిస్తున్నారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నర్సరీ ఏర్పాటు..
హరితహారం కింద మొక్కలు నాటేందుకు నర్సరీలో వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. మొక్కలకు ప్రతి రోజు నీటిని అందించేందుకు వనసేవకులను నియమించి నర్సరీలో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. 14వేల మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు.