హైదరాబాద్ : సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli) వెల్లడించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులు, టెక్స్టైల్ పార్క్(Textile Park) కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ కొత్తగా వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్క్ లో అనేక కంపెనీలు వచ్చాయని, ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని వివరించారు. ఇప్పటికే ఆయా కంపెనీలు ప్రాథమిక స్థాయిలో తమకు అవసరమైన ఉద్యోగులను(Employees) నియమించుకున్నాయని, మరికొంత మందికి ఉపాధి కల్పించాయని తెలిపారు.
అయితే, కుట్టు శిక్షణ(Sewing training) పూర్తి చేసుకున్న వారికి మంచి అవకాశాలున్నాయని తెలిసి, పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే రెండు విడతలుగా వెయ్యి మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. మరో 2 వేల మందికి శిక్షణ జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ కల్లా ఈ శిక్షణ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ నెలకల్లా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న అర్హులైన వారికి వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో దశల వారీగా ఉద్యోగావకాశాలు లభించే విధంగా చేస్తామన్నారు. ఇదే విషయమై ఆయా కంపెనీల బాధ్యులు, అధికారులతో కలిపి సమీక్షించామని మంత్రి వెల్లడించారు.
గురుకుల పాఠశాలలు(Residential Schools), హాస్టల్స్ విద్యార్థులకు(Hostel Students) యూనిఫామ్స్ (Uniforms) వంటి ఆర్డర్లు అప్పగించేందుకు ఆయా ప్రభుత్వ శాఖలకు లేఖలు రాస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సమీక్షలో టీఎస్ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ మిహిద్, టెక్స్ టైల్స్ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, వరంగల్ లోని కీ టెక్స్ కంపెనీ ప్రతినిధి మనోజ్ కుమార్, యంగ్ వన్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్, తదితరులు హాజరయ్యారు.