హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): మేడారం జాతర పనుల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి కలిసి రూ. 200 కోట్ల కుంభకోణం చేశారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సంచలన ఆరోపణలు చేశారు. నాసిరకమైన రాతికట్టడాలు కుప్పకూలుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఆలయ పూజారి రమేశ్ కొడుకు సమ్మక్క గద్దెశిల కూలి తీవ్రంగా గాయపడ్డాడని శుక్రవారం ప్రకటనలో గుర్తుచేశారు. ఈ ప్రమాదానికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రుల అక్రమ ధన దాహానికి పూజారి కొడుకు యువిన్ రెండు కాళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
బాలుడి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యాతాలోపంతో పనులు చేసి, వనదేవతలను అవమానించినందుకు మంత్రి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మేడారం అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. లేదంటే ఈ అక్రమపర్వంలో ముఖ్యమంత్రికి సైతం వాటా ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.