కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు
హామీ నిలబెట్టుకున్న సర్కార్
ఖాళీ పోస్టులన్నీ నాలుగు క్యాటగిరీలుగా విభజన
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20 శాతం వెయిటేజీని ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆధ్వర్యంలో ప్రభుత్వం 10,028 పోస్టులు భర్తీచేయనున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా పోస్టుల నియామకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. నూతన నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని పలు సర్వీస్ నిబంధనలను సైతం సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
నాలుగు క్యాటగిరీలుగా పోస్టులు
ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా నియమించే అన్ని రకాల పోస్టులను వైద్యారోగ్య శాఖ నాలుగు క్యాటగిరీలుగా విభజించింది. స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, స్టాఫ్నర్సులు, ఎంపీహెచ్ఏ/ఏఎన్ఎంగా విభజించి, ఒక్కో క్యాటగిరీకి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి రెండు క్యాటగిరీల్లో మార్కుల ఆధారంగా నేరుగా నియమిస్తారు. మిగతా రెండు క్యాటగిరీలకు ప్రవేశపరీక్ష ఉంటుంది. అన్ని క్యాటగిరీల్లో 20 పాయింట్లను/మార్కులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీగా ఇస్తారు. నియామకాలకు దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే సమర్పించాలి.
20 శాతం వెయిటేజీ ఇలా..
వైద్యారోగ్య శాఖ పరిధిలో 13 క్యాటగిరీల పోస్టులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. గరిష్ఠంగా 20 పాయింట్లు ఇస్తారు. టీఎస్పీఎస్సీ, ఎంహెచ్ఎస్ఆర్బీ నియామకాలకు ఇది వర్తిస్తుంది. ఆయా అభ్యర్థులు కచ్చితంగా అనుభవ ధ్రువీకరణ పత్రం (ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి ఉంటుంది.
వెయిటేజీ పొందేవారు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంవో, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎంపీహెచ్ఏ(ఫిమేల్)/ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్.
క్యాటగిరీ-1:
స్పెషలిస్ట్ డాక్టర్లు – అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు. పీజీ లేదా సూపర్ స్పెషాల్టీ కోర్సులో సాధించిన మార్కులను పాయింట్లుగా మారుస్తారు. గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం ఉన్న యూనివర్సిటీల్లో చదివినవారికి.. ఏ గ్రేడ్ లేదా ఎక్సలెంట్ వంటివి వస్తే 60 శాతం మార్కులుగా, బీ గ్రేడ్ లేదా గుడ్ వంటివి వస్తే 55 శాతం, మిగతా గ్రేడ్లకు 50 శాతం మార్కులు కేటాయిస్తారు.
క్యాటగిరీ-2:
ఎంబీబీఎస్ డాక్టర్లు – సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంవో తదితరులు. ఎంబీబీఎస్లో సాధించిన మార్కులను పాయింట్లుగా మార్చి, గరిష్ఠంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి వచ్చినవారికి నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్’ (ఎఫ్ఎంజీఈ)లో సాధించిన మార్కులను పాయింట్లుగా మార్చి కేటాయిస్తారు.
క్యాటగిరీ-3:
స్టాఫ్ నర్సులు, క్యాటగిరీ-4: ఎంపీహెచ్ఏ (ఫిమేల్)/ఏఎన్ఎం. మల్టిపుల్ చాయిస్ రూపంలో 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులు వెయిటేజీ రూపంలో ఉంటాయి.