హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి కొత్తగా మరో 20 కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు)లు రానున్నాయి. వీటి ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. విద్యాపరంగా వెనుకబడ్డ జిల్లాల్లో ఈ కేజీబీవీలను ఏర్పాటు చేయనున్నారు. ఇవేకాకుండా మరో 22 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసేందుకు అనుమతివ్వాలని విద్యాశాఖ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ఈ రెండు ప్రతిపాదనలను ఈ నెల 15,16 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమగ్రశిక్ష ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (ఎస్ఎస్ఏ పీఏబీ) సమావేశం ముందుంచనున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఉచితంగా యూనిఫారాలిస్తుండగా, ఈసారి షూ, బ్యాగ్, టై, బెల్డ్ వంటి వాటిని అదనంగా చేర్చారు. ఇందుకు రూ. 270 కోట్లవుతుందని అధికారులు అంచనా వేశారు. వేలాది మంది పేద బాలికలను అక్కున చేర్చుకొని.. చక్కటి చదువులందించే కేజీబీవీలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది.
జాతీయ సగటు కన్నా తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యాలయాలు రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కేవలం 391 కేజీబీవీలుండేవి. 2017-18లో 84 కేజీబీవీలను మంజూరుచేశారు. గతేడాది కొత్తగా 20 కేజీబీవీలు మంజూరుతో వాటి సంఖ్య 495కి చేరింది. 2024-25 లో మరో 20 కొత్త కేజీబీవీలను నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పంపించారు. ఇందకు ఆమోదం లభిస్తే కేజీబీవీల సంఖ్య 515కు చేరుతుంది. కేజీబీవీలను గతంలో పదోతరగతి వరకు మాత్రమే నిర్వహించగా, ఏటా కొన్నింటిని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తున్నారు.
ఎస్ఎస్ఏ పీఏబీని ఏటా ఒకసారి నిర్వహిస్తారు. అయితే రెండేండ్లకు ఒకసారి నిర్వహించేందుకు కేంద్రం సన్నాహకాలు చేస్తోంది. ఇందులోభాగంగా 2024 -25, 2025- 26 రెండు విద్యాసంవత్సరాలకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించారు. 2024 -25 విద్యాసంవత్సరానికి రాష్ట్రం నుంచి రూ. 2,700 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. అయితే కేంద్రం రూ.1,913 కోట్లకు సీలింగ్ విధించింది. పది రోజుల్లో జరుగనున్న పీఏబీ సమావేశంలో కేంద్రం ఎంత మేరకు కేటాయించనున్నదో తేలనున్నది.