లక్ష్మీదేవిపల్లి, జనవరి 6 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని సాయిఅంజనా బజాజ్ షోరూంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 లక్షల నగదుతోపాటు సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్డిస్క్ను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగా గురువారం రాత్రి షోరూంను మూసివేసి యజమానితోపాటు సిబ్బంది ఇంటికెళ్లిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో షోరూం వెనుక భాగంలో పైకప్పు రేకులను తొలగించి లోపలికి చొరబడ్డారు.
ఎండీ చాంబర్లో ఉన్న టేబుల్లో నుంచి సుమా రు రూ.2 లక్షల నగదుతోపాటు సీసీ కెమెరాకు సంబంధించిన డివైస్, హార్డ్ డిస్క్ను అపహరించారు. శుక్రవారం ఉదయం షోరూంకు వచ్చిన ఎండీ శ్రీనివాసరావు.. చోరీ జరిగినట్టు గుర్తించి లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రమాకాంత్, ఎస్సై ప్రవీణ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.