Telangana | వరంగల్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించింది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ర్టానివే ఉన్నాయి. అన్ని పంటలకు కలిపి సగటున యేటా 44 లక్షల టన్నుల విత్తనాల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నది. మేలు రకం, ఎక్కువ ఉత్పత్తి వచ్చే విత్తనాల కోసం దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండును తెలంగాణ రైతాంగా అందిపుచ్చుకుంటున్నది.
పుష్కలంగా సా గునీరు, నిరంతర కరెంటు సరఫరాతో విత్తన పంట ల సాగు రాష్ట్రంలో ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. ఒక్క ఉమ్మడి వరంగల్లోనే 2 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ రకమైన విత్తనాలు తెలంగాణ నుంచే 50% వరకు ఉత్పత్తి అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో మన విత్తనాలతోనే పంటలు సాగవుతున్నాయి. చైనా, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్తోపాటు మరో పది దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు తెలంగాణలోనే కార్యకలాపాలు పెంచుతున్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 62 కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేయిస్తున్నాయి.
సాధారణ వరి పంట సాగుతో రైతులకు పెట్టుబడి పోను ఎకరానికి 20 వేల వరకు మిగులుతాయి. అదే విత్తన వరి సాగుతో ఎకరాకు 40 వేలు, విత్తన మక్కజొన్నకు 30 వేల వరకు లాభం వస్తుంది. రైతులు ఏటా రూ.150 కోట్ల వరకు లాభపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్సీడ్స్) ఉత్పత్తి చేసే వరి విత్తనాలకు ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉన్నది. టీఎస్సీడ్స్ వరంగల్ యూనిట్ విత్తనాలకు మంచి పేరు ఉన్నది. టీఎస్సీడ్స్ వరంగల్ యూనిట్ ప్రతి ఏటా సగటున రూ.50 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నది. ఒక్క సీజన్లోనే 50 వేల కింటాళ్ల అమ్మకాలు జరుగుతున్నట్టు టీఎస్ఎస్డీసీ, వరంగల్ యూనిట్ రీజినల్ మేనేజర్ భయ్య రఘు తెలిపారు.