హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సమున్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ-2020’కి అనుగుణంగా శంషాబాద్ జోన్ చేగూర్లోని కన్హా శాంతి వనం సమీపంలో 536 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సూత్రపాయంగా ఆమోదం తెలుపుతూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే పాలసీ కింద శంకర్పల్లి జోన్ పటాన్చెరువు సమీపంలోని పెద్ద కంజర్లలో అరబిందో తత్వ టౌన్షిప్ డెవలపర్స్ ఎల్ఎల్పీ సంస్థ తొలి విడతగా 98 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను అభివృద్ధి చేస్తున్నది. దీనికి హెచ్ఎండీఏ అధికారులు నిరుడు సెప్టెంబర్లోనే అనుమతులిచ్చారు. ఈ రెండింటితోపాటు మున్ముందు ఔటర్ రింగు రోడ్డు వెలుపల మరిన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యం
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి ప్రణాళికలను అమల్లోకి తెచ్చింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నగరాభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని సంకల్పించింది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి దాటడం, జనాభా అంతా ఒకే చోట కేంద్రీకృతమవడం వల్ల భవిష్యత్తులో అనేక అవాంతరాలు తలెత్తుతాయని హెచ్ఎండీఏ భావిస్తున్నది. అందుకే నగర శివారు ప్రాంతాలతోపాటు రోడ్డు, రైలు మార్గాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో మినీ పట్టణాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించి, దశలవారీగా వాటిని అభివృద్ధి చేస్తున్నది.
మరో 5 చోట్ల ప్రతిపాదనలు
ఇప్పటివరకు రెండు చోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల ఏర్పాటుకు హెచ్ఎండీఏ ఆమోదం తెలుపడంతో మరో 5 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. కొల్లూరు, కందుకూరులో, మనోహరాబాద్, పగిడిపల్లి, ఇబ్రహీంపట్నంలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థలు హెచ్ఎండీఏని సంప్రదించాయి. వీటికి అనుమతులు లభించి, నిర్మాణాలు పూర్తయ్యేందుకు 2-3 ఏండ్ల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.