హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన శ్రీశైలం వరకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు రోజులుగా 2.32 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. మరో రెండు రోజులపాటు వరద ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. గోదావరిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, పార్వతి, సర్వస్వతి బరాజ్లకు సైతం వరద తగ్గింది. కేవలం మేడిగడ్డ, సమ్మక్క బరాజ్ వద్ద మాత్రమే కొద్దిపాటి ప్రవాహం కొనసాగుతున్నది.
అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో బుధవారం పొడి వాతావరణం ఏర్పడింది. వరుణుడు శాంతించడంతో గోదావరికి వరద తీవ్రత కాస్త తగ్గింది. ఈ నెల 24 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.