హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతుండగా, కృష్ణమ్మ బిరాబిరా అంటూ శ్రీశైలానికి తరలివస్తున్నది. ఆదివారం సాయంత్రానికి ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అక్కడినుంచి వరదను విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 2.26 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. నాగార్జునసాగర్కు నామమాత్రంగానే కొనసాగుతున్నది. కాగా, కృష్ణానదిలోని సంగమేశ్వరాలయం కృష్ణా నీటిలో మునిగింది.
గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు భారీగా తగ్గిపోయాయి. దిగువన ప్రాణాహిత నుంచి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రానికి 5.70లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం రాత్రి 10 గంటలకు 49 మీటర్లకు పడిపోయింది. దాంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.