Bhadrachalam | ఖమ్మం, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజం గడప దాటకముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్నది లోకోక్తి. బురద చల్లటమే పనిగా పెట్టుకున్నవారు కండ్లున్నా కబోదుల కిందే లెక్క. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ పాలనపై నిత్యం పడి ఏడ్చే ఆ పత్రికకు నిజాలతో పనిలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటానికి విఫలయత్నం చేసే ఆ విషపుత్రిక మరో మారు భద్రాచల రాముడిని వివాదంలోకి లాగింది. రాములోరి బ్రహ్మోత్సవాలకు నిధుల కొరత అంటూ నిరాధార కథనాలను కొన్ని పత్రికలు వండి వార్చాయి. రాష్ట్రంలో అధిక ఆదాయాన్ని ఆర్జించే ఏ-6 క్యాటగిరీ ఆలయాల్లో ఒకటైన భద్రాచలానికి నిధుల కొరత ఉందనటమే హాస్యాస్పదం. గతంలో రామ-నారాయణ వివాదాన్ని సృష్టించిన వారే ఇప్పుడు ఈ విష ప్రచారానికి పూనుకున్నారు.
భద్రాచలం ఆలయానికి ఆంధ్రా, తెలంగాణలో వందలాది ఎకరాల భూములున్నాయి. రూ. కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో భద్రంగా ఉన్నాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా శ్రీరామనవమి ఉత్సవాలకు, పుష్కర కాలానికి ఒకసారి జరిపే సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహణకు ఆలయాధికారులు విరాళాలు కోరుతూ కరపత్రాలు వేయటాన్ని ప్రశ్నిస్తూ లేని వివాదాన్ని రాజేస్తున్నారు. దేవస్థాన అధికారులు ప్రతి అంశాన్ని పారదర్శకంగా భక్తుల దృష్టికి తీసుకురావటం కూడా తప్పేనా? ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉన్నది. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంలో నిర్వహించే తంతు, అందుకు చేయాల్సిన పనుల జాబితాను ఆలయాధికారులు భక్తుల ముందు ఉంచారు. విరాళాలివ్వటం అనేది దేవాదాయ, ధర్మాదాయ చట్టపరిధిలోని అంశమేనన్న విషయాన్ని మరిస్తే ఎలా? స్వామి వారి మహత్కార్యానికి దేశం నలమూలల నుంచి వేలాది మంది భక్తులు ధన, వస్తు రూపేణ సహకరించటం, భూరి విరాళాలు ప్రకటించటం కొత్తేమీ కాదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈసారి శ్రీరామనవమితోపాటు 12 ఏండ్లకు ఒకసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది రూ.75 లక్షలు అదనంగా ఖర్చు చేస్తూ సుమారు రూ.2.25 కోట్ల వ్యయంతో ఈ మహత్కార్యాన్ని నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సమయంలో ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించటాన్ని ఆలయవర్గాలు ఖండిస్తున్నాయి. పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదన్న దుష్ప్రచారాన్ని దేవస్థానం అధికారులు తిప్పికొట్టారు. దేవాలయంలోని ప్రతి ఆర్థిక అంశం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ప్రకటించారని, అవి ఇంకా విడుదల కాలేదని ప్రచారం చేస్తున్న మహానుభావులు వాటిని ఖర్చుపెట్టే విధానాన్ని అర్థం లేకుండా వ్యాఖ్యానిస్తుండడం బాధాకరం. 2015, 2016 సంవత్సరాల్లో భద్రాచలంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరయ్యారని, 2016లో భద్రాచల ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించారని పేర్కొంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించటం వారి విజ్ఞతకే వదిలేయాలి. నిజానికి 2017 బడ్జెట్లో కేసీఆర్ మాటిచ్చిన విధంగానే రూ.100 కోట్ల కేటాయింపు కూడా చేశారు. దేవస్థాన పరిధిలో ఏ అభివృద్ధి జరగాలన్నా అందుకు సంబంధించి శాశ్వత నిర్మాణాలు ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం.అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ప్రతి నిర్మాణాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోయేలా చేస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం పట్టణం శాశ్వతంగా 43 అడుగుల నీటిమట్టంతో ఉండే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పును నిర్ధారించుకున్నాకే శాశ్వత కట్టడాలు జరపాలన్నది భక్తుల కోరిక కూడా. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించటాన్ని కూడా తప్పుపట్టటంపై భక్తులు మండిపడుతున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు ప్రకటించిన వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు దేవస్థాన ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణాలు ఉండేలా చూసేందుకు ఆనందసాయిని దేవాలయ ఆర్కిటెక్చర్ సలహాదారునిగా నియమించింది. దేవాలయ అభివృద్ధి, ప్రాకార నిర్మాణాలపై ప్రభుత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి ఉండటంతోనే ఆనందసాయిని సలహాదారునిగా నియమించింది.
1998 నుంచి అప్పటి ఉమ్మడి పాలకులు శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారికి సమర్పించే ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలకు రూ15 వేలు ఇస్తామని 1998లోనే ప్రకటించారు. కానీ, దేవస్థాన ఖజానాలో జమ చేసిన దాఖలాలే లేవు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2019లో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలకు రూ.15 వేలు ఏ మాత్రం సరిపోవని భావించి కేసీఆర్ సూచనల మేరకు ప్రతి సంవత్సరం రూ. లక్ష పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాల కింద ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా రావటంతో శ్రీరామ నవమి, పట్టాభిషేక వేడుకలు అంతర్గతంగానే నిర్వహించారు.
దేవస్థానంలో ఏటా వైభవోపేతంగా శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలు జరుగుతాయి. 12 సంవత్సరాలకోసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలు ఈసారి నిర్వహించాల్సి ఉన్నది. గతేడాది కంటే ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మేం ముందుగానే ఏయే ఉత్సవాన్ని ఎంత ఖర్చుతో నిర్వహిస్తున్నామో ప్రకటిస్తున్నాం. విరాళాల సేకరణ దేవస్థాన లక్ష్యం కాదు. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం నిర్వహించేందుకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయి. భక్తులు తమ శక్తికొలదీ ఇచ్చే విరాళాలు తప్ప మేం ప్రత్యేకంగా ఎవరినీ అడగలేదు. ఇక ముందుకూడా అడగబోం.
– రమాదేవి, ఆలయ ఈవో