Swapping | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మంది రోగులకు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఇందులో 7-8వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది. మిగిలిన వారంతా వారం, పదిరోజులకోసారి డయాలసిస్తో దవాఖానల చుట్టూ తిరుగుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో పాటు డయాలసిస్కు నెలకు సుమారు రూ.40-50వేలు వెచ్చించాల్సి వస్తున్నది. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఇతరత్రా ఇన్సూరెన్స్ల కింద ఉచితంగా సేవలు అందించినా భారమే. అందుకే కిడ్నీ మార్పిడికి అవకాశాలను మెరుగుపరచటం ద్వారానే రోగి కి పునర్జన్మనిచ్చి, వారి కుటుంబానికి ఊరట కలిగించవచ్చు.
కిడ్నీ దాతలు రెండు మార్గాల ద్వారానే లభిస్తారు. బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి కిడ్నీని సేకరించడం(కెడావర్), రోగి రక్త సంబంధీకులు ఎవరైనా ముందుకొస్తే వారి నుంచి కిడ్నీని సేకరించి మార్పిడి చేయటం. ఇందులో బ్రెయిన్డెడ్ కేసులు నమోదైనప్పుడే కిడ్నీ దొరుకుతుంది. ఇందుకోసం జీవన్దాన్లో రోగి పేరు నమోదు చేసుకుంటే, సీరియల్ ప్రకారం కెడావర్ కేసు వచ్చినపుడు కిడ్నీని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నిమ్స్ వేదికగా నిర్వహిస్తున్న జీవన్దాన్లో అత్యధికంగా వెయిటింగ్ జాబితా ఉన్నది కిడ్నీ రోగులదే. రెండో మార్గంగా, రోగి రక్త సంబంధీకులు ముందుకొచ్చినా ఇద్దరిదీ ఒకే బ్లడ్ గ్రూపు ఉండాలి. మ్యాచ్ కాకపోతే మార్పిడి అసాధ్యం. అయితే గత పదేండ్లుగా బ్లడ్ గ్రూప్స్ కలవకపోయినప్పటికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రత్యేక పద్ధతి ‘ఏబీవో ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’ అందుబాటులోకి వచ్చింది. కానీ సాధారణంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అయ్యే దానికంటే ఈ విధానానికి కనీసంగా రూ.3-4 లక్షల వ్యయం అదనంగా అవుతుంది. అందుకే మధ్య తరగతి కుటుంబాల వాళ్లు కెడావర్ కోసం ఎదురుచూస్తూ డయాలసిస్తో నెట్టుకొస్తున్నారు. అయితే డయాలసిస్ తాత్కాలిక ఉపశమనమే. పైగా కాలం గడిచేకొద్దీ రోగిలో రోగనిరోధకశక్తి తగ్గి ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది.
కిడ్నీ రోగులకు దాతల సంఖ్య పరిమితంగా ఉన్న ఈ తరుణంలో ‘స్వాప్ (పెయిర్డ్) కిడ్నీ మార్పిడి’ విస్తృతమైతే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. స్టార్ దవాఖాన నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ గంధె శ్రీధర్ తొమ్మిదేండ్లుగా రిజిస్టర్ నిర్వహిస్తూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఒక వైద్యుడి విస్తృతి పరిమితంగా ఉంటున్నందున ఆయన ఇప్పటివరకు 3-4 వరకు స్వాప్ కిడ్నీ మార్పిడి చేయగలిగారు. అమెరికాలో ఏటా 30% స్వాప్ మార్పిడీలు ఉంటున్నాయని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇందుకోసం అక్కడ ‘నేషనల్ స్వాప్ రిజిస్ట్రీ’ పేరుతో ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మన దేశంలో నూ దీనిపై విస్తృత అవగాహన కలగాలని అం టున్నారు. ఫలితంగా కిడ్నీ దాతల లభ్యత 30-35 శాతానికి పెరుగుతుందని వివరిస్తున్నారు.
స్వాప్ విధానంపై అవగాహన పెంచడంతో పాటు ఒక వేదికను కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందిస్తున్నట్టు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దీని ద్వారా కిడ్నీ రోగులు తమ కుటుంబంలో దాత ఉండి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఈ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని, తద్వారా దాతల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ విధానంపై రోగుల్లో విస్తృతంగా అవగాహన పెంచడంతో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న జీవన్దాన్కు సమాంతరంగా ఆన్లైన్లో ‘స్వాప్’ వేదికను నిర్వహిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని సూచించారు.
ఒక కుటుంబంలో తండ్రికి ఒక కిడ్నీ చెడిపోయింది. కిడ్నీ మార్పిడి తప్ప శాశ్వత పరిష్కారం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. తండ్రి మీద ప్రేమతో కొడుకు ఒక కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చాడు. కానీ తండ్రిది ఓ-బ్లడ్ గ్రూప్. కుమారునిది మాత్రం బీ-బ్లడ్ గ్రూప్. మ్యాచ్ కాదని వైద్యులు చెప్పేశారు. కిడ్నీ దాతల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్దాన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరాలకు తన వంతు వస్తుందో కూడా తెలియని విషమ పరిస్థితి. అంతకాలం డయాలసిస్తో ప్రాణం అరచేతులో పెట్టుకొని కాలం వెళ్లదీయాలి.
మరో కుటుంబంలో ఇదేరీతిన తండ్రికి కిడ్నీ చెడిపోయింది. ఇక్కడా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను వైద్య నిపుణులు సూచించగా, కిడ్నీ దానం కోసం కూతురు ముందుకొచ్చింది. అయినా పైకేసు మాదిరే ఇక్కడా తండ్రిది బీ-బ్లడ్ గ్రూప్, కూతురుది ఓ-బ్లడ్ గ్రూప్. ఈ కుటుంబం కూడా జీవన్దాన్లో దరఖాస్తు చేసుకొని, వారానికోసారి డయాలసిస్, నిత్యం మందులతో కాలం గడుపుతున్నారు. దాత దొరికేదెన్నడు? ప్రాణానికి గ్యారెంటీ లభించేదెన్నడు?
నిబంధనల ప్రకారం కిడ్నీ రోగికి రక్త సంబంధం ఉన్న వారు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. లేకపోతే జీవన్దాన్లో పేరు నమోదు చేసుకోవాలి. వాస్తవానికి పై రెండు ఉదాహరణల్లో కుటుంబసభ్యుల బ్లడ్ గ్రూపులు కలవనప్పటికీ, పరస్పరం మాత్రం బ్లడ్ గ్రూపులు మ్యాచ్ అవుతున్నాయి. దీంతో రెండు కుటుంబాలు పరస్పరం కిడ్నీ దానం చేసుకొంటే రెండు ప్రాణాలు నిలబడతాయి. దీనినే ‘స్వాప్’ విధానం లేదా పెయిర్డ్ కిడ్నీ ఎక్సేంజ్ అని అంటారు. ఇలాంటి కేసులకు ఒక వేదిక కల్పించటం ద్వారా ఎందరో కిడ్నీ రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. చాలారోజుల నుంచి వ్యక్తిగతంగా ఇలాంటి ప్రయత్నం చేస్తూ పలువురి ప్రాణాలు కాపాడుతున్న స్టార్ దవాఖాన నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ గంధె శ్రీధర్ ఒక బహిరంగ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో స్వాప్ కిడ్నీ ఎక్సేంజ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించబోతున్నారు.