మెండోరా/పుల్కల్, జూలై 10: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తొమ్మిది వరద గేట్లు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. తొమ్మిది వరదగేట్లు ద్వారా దిగువకు 25 వేల క్యూసెక్కులు వదిలారు. క్రమంగా 18 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు నీటి విడుదలకు పెంచుతామని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. మరో మూడు రోజులపాటు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చే అవకాశమున్నదన్నారు. సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 5,375 క్యూసెక్కులుగా నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి 89,999 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 2,37,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కృష్ణా బేసిన్లోని పలు ప్రాజెక్టులకు వరద వస్తున్నది. మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
కాళేశ్వరానికి వరద ఉద్ధృతి:లక్ష్మీ బరాజ్లో 75 గేట్లు ఎత్తివేత
గోదావరిలో వరద ఉద్ధృతి పెరగడంతో కాళేశ్వరంలోని పలు బరాజ్లకు వరద తాకిడి పెరిగింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లికి ఎగువ నుంచి 2,82,666 క్యూసెక్కుల వరద వస్తుండగా బరాజ్ లో నికరంగా 14.64 టీఎంసీల నీటి మట్టాన్ని ఉం చుతూ 27 గేట్లను ఎత్తి 3,44,229 క్యూసెక్కుల నీటిని దిగువన గల పార్వతీ బరాజ్లోకి వదులుతున్నారు. ఇక్కడ 58 గేట్లను ఎత్తి 3.80 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. 8.83 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బరాజ్లో 1.61 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సరస్వతీ బరాజ్లో 50 గేట్లను ఎత్తి 3,55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లక్ష్మీ బరాజ్కు వరద జలాలకు తోడు ప్రాణహిత నుంచి వస్తున్న జలాలు భారీగా వస్తుండటంతో 75 గేట్లను ఎత్తి 8,83,230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.