హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజే 18,570 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తు చేసుకొన్నారు. గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియనున్నది. భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ఏడున్నర ఏండ్ల తర్వాత పెద్ద ఎత్తున టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో జూలై- ఆగస్టులో టీచర్లకు పదోన్నతులు, 2018 జూలైలో 317 జీవో ద్వారా సర్దుబాటు బదిలీలు చేపట్టింది.
ముంపు గ్రామాల పరిధిలో పనిచేస్తున్న 8 ఏండ్ల సర్వీసు నిండని టీచర్లపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. వీరికి 10 అదనపు పాయింట్లు కేటాయించడమే కాకుండా, ఆయా పోస్టులను అవసరమైన పాఠశాలలకు తరలించేందుకు అనుమతి ఇచ్చిం ది. మల్లన్నసాగర్, అనంతగిరిసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణంతో పలు గ్రామాలు ముంపునకు గురికాగా, ఆయా గ్రామాల్లోని టీచర్ పోస్టులను ఇతర బడులకు తరలించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దరఖాస్తుకు 28 నుంచి 30 వరకు కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. విద్యాశాఖ జిల్లాలవారీగా రిసోర్స్ పర్సన్స్ను నియమించింది.