Harish Rao | దేవరుప్పుల, మార్చి 24: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండుతుంటే కడుపు తరుక్కుపోతున్నదని అన్నారు. ఆదివారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా, చింతబాయి తండా, పచ్చర్లబాయి తండాల్లో ఎండిన వరి పొలాలను హరీశ్రావు పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొన్నారు. కన్నీరుమున్నీరైన రైతులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కాంగ్రెస్ పాలనలో రైతుల కండ్లలో కన్నీళ్లు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పదేండ్లుగా కేసీఆర్ సర్కారును నమ్ముకుని వ్యవసాయం చేసిన రైతులు రేవంత్ సర్కారులో నిండా మునిగారు. ఎకరాల కొద్దీ నాటు పెట్టినా దొయ్యలు పారడం లేదనే రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు లేక 20 లక్షల ఎకరాలు ఎండిపోగా, వడగండ్లతో లక్ష ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రతిపక్షాల ఇండ్లకు జొర్రి వారిని గంగిరెద్దుల్లా ఎత్తుకెళ్తున్న అధికారపక్ష నాయకులకు, రైతుల ఇండ్లకు వెళ్లి ఓదార్చే ఓపిక లేకపోయింది. నదుల్లో నీరున్నా నీటి నిర్వహణ చేయలేని ఈ ప్రభుత్వం యాసంగి వేళ రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ప్రభుత్వ వైఫల్యంతో పంటలు ఎండుతున్నాయి. పార్టీ గేట్లు తెరిచామని చెప్పుకుంటున్న రేవంత్ సర్కారు.. ప్రాజెక్ట్ల గేట్లు తెరవలేకపోతున్నది. ఒక్కో రైతు గాథలు వింటుంటే ఏడుపు వస్తున్నది.
బక్క పలచని గిరిజన రైతులు నీరులేక తమ పంటలు ఎండుతుంటే చూడలేక మూడు నాలుగు బోర్లు వేసి లక్షల్లో డబ్బు ఖర్చు చేశారు. ఈ డబ్బులు మిత్తికి తెచ్చి పెట్టామని చెబుతుంటే నీరుండీ ఇవ్వలేని ఈ సర్కారును ఏమనాలి?’ అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేని ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన రైతుబంధు అమలు కాకపోగా, ఉన్న రైతుబంధు నేటికి రైతుల ఖాతాల్లో పడటం లేదని గిరిజన రైతులు చెప్పడం ఈ సర్కారు పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీకి అతీగతి లేదని, రైతుకూలీలకు ఇస్తామన్న రూ.2,500 పింఛను ఎటుపోయిందని ప్రశ్నించారు.
ఎకరాకు 25 వేలు ఇవ్వాలి
సాగునీరు అందక ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు. బోర్లు వేసి, పంటలు ఎండి అప్పుల పాలై ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిన రైతులకు ఈ నష్ట పరిహారంతో కొంతైనా ఓదార్పు ఉంటుందని తెలిపారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా ఫలితం లేకపోవటంతో ఎండిన పంటచేనులో పశువులను మేపుతున్నారని గుర్తుచేశారు.
పదేండ్లుగా కానరాని బోరుబండ్లు, పూడిక కేన్లు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని, మోటర్లు కాలుతున్నాయని తెలిపారు. యాసంగి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్, ఎండిన పంటకు నష్ట పరిహారం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పూర్తిగా అమలు చేస్తేనే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని అన్నారు. రైతుహామీలు అమలు చేయకపోతే, పంట నష్టం అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియేట్కు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లోపే ఈ హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
పట్నంలో ఉప్పరిపనికి పోవడ్తదేమో?
సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు. రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సాగునీరు అందించాలి. నేతల ఇండ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం కాదు. పంటనష్టంతో అల్లాడుతున్న రైతులను ఓదార్చి, పరిహారం అందించాలి.
– హరీశ్రావు
హరీశ్రావు: ఎంత పొలం నాటు పెట్టినవ్?
రైతు సుమలత: మాకున్న ఎకరం పొలం నాటు పెట్టినం. ఉన్నకాడికి ఎండిపోయింది. బోర్లు ఏస్తే పడలే. పైసల్ దండుగైనయ్. తిండి గింజల కరువొచ్చింది.
హరీశ్: మరి తాగునీళ్లన్నా వస్తున్నయా?
సుమలత: అవిగూడ వస్తలేవు. ఇదివరకు ఫుల్లుగా వచ్చేవి. ఎప్పుడు తిప్పినా నల్లపోసేది. ఇప్పుడు గోలెం నిండుతలేదు.
హరీశ్రావు: భగీరథ నీళ్లు వస్తలేవా?
సుమలత: అవే నీళ్లు గిన్నన్ని వస్తున్నయ్. ఎనుకటి కరువు మళ్లా వచ్చింది. బిందెలతోని తెద్దామన్నా బోర్లు పోస్తలేవు. ఈ సర్కారు మాట నిలబెట్టుకోలే. ప్రజలు రేవంత్రెడ్డి మాయమాటలకు మోసపోయిండ్రు. ఇగ కరువు కాలమే. మళ్లా పట్నంల ఉప్పరిపనికి పోవాల్సిందేనిని తండా జనం అనుకుంటుండ్రు.
కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినం హరీశ్రావు: యాసంగికి ఎన్ని ఎకరాలు నాటు పెట్టినవ్?
కున్సోతు నర్సింహ: నేడు 6 ఎకరాలు నాటుపెట్టిన సారు. 4 ఎకరాలు ఎండిపోతే పశువులను మేపిన. ఉన్న రెండెకరాలు పొట్టలమీద ఎండుతున్నది. రెండు దొయ్యలు పారుతున్నయ్. పొలం ఎండుతుందని రూ.4 లక్షలు మిత్తికి తెచ్చి 5 బోర్లు వేసిన. ఒక్కటీ పడలేదు.
హరీశ్రావు: ఇదివరకు ఎప్పుడన్నా పొలం ఎండిందా?
నర్సింహ: పదేండ్ల నుంచి ఎన్నడూ ఎండలే. అదే నమ్మకంతోని నాటుపెట్టిన. మంత్రి దయన్న ఉన్నపుడు రెండు కార్లు కాలువలు పారేది. చెరువులు నిండేది. బోర్లు ఫుల్ పోసేది. ఇప్పుడు పట్టించుకునేనాథుడే లేడు. ఎమ్మెల్యే యశస్విని నీళ్లు వదులతనన్నది. కానీ వదల్లేదు. పంట ఎండింది. ఇంత నీళ్ల కరువు ఎన్నడు చూడలె. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినం
హరీశ్రావు: నీళ్లుండీ ఇవ్వలేని ప్రభుత్వమిది. అధైర్యపడకు మంచిరోజులు వస్తయ్. ఎండిన వరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.