హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ఆశాజనకంగా మారింది. నైరుతి రుతుపవనాలు, వరుస అల్పపీడనాల ప్రభావంతో సాధారణాన్ని మించి రాష్ట్రంలో వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ఇప్పటి వరకు మూడు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 297.4 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 350.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 18 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు స్పష్టంచేసింది. నల్లగొండ జిల్లాలో 54 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 25, ఖమ్మం జిల్లాలో 24 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట్, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వేసిన అంచనాలకు మించి.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం నమోదు కావడంపట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.