హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమ స్తే తెలంగాణ): సింగరేణి ఉద్యోగులకు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. సుమారు రూ.2800 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నామని, సగటున ఒక్కో కార్మికుడు సుమారు రూ.6.5 లక్షలు అందుకోనున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో రాను న్న రోజుల్లో మరింత కష్టపడి లక్ష్యాలను సాధించాలని సీఎండీ సూచించారు. వచ్చే మార్చికల్లా 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాలని ఆదేశించారు.
సోమవారం సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ మాట్లాడారు. నిరుటితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో మెరుగైన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించి లక్ష్యం దిశగా సాగుతున్నారని సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. రానున్న ఏడు నెలల కాలంలో ప్రతి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాల వల్ల ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ.. గనుల్లో నిలిచే నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్టు ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్లు, అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్ర పాండే, ఈడీ జే ఆల్విన్, జీఎంలు సురేశ్, జక్కం రమేశ్, మల్లెల సుబ్బారావు, దేవేందర్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.