హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్తోపాటు మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న 16 మంది రాడికల్ ఇస్లామిస్ట్ (హిజ్బ్-ఉత్-తహ్రీర్) కార్యకర్తలను తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఆధారంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ సంయుక్తంగా మూడు రోజులపాటు హైదరాబాద్లో నిఘా పెట్టడంతో వీరి గుట్టురట్టయ్యింది. వీరిలో 11 మందిని భోపాల్లోని బాగ్ ఉమ్రావ్ దుల్హా, జవహర్కాలనీ, బాగ్ ఫర్హత్ ఆఫ్జా, చింద్వారా ప్రాంతాల్లో, మరో ఐదుగురిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ భోపాల్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుల నుంచి ఎయిర్గన్నులు, కత్తులు, డాగర్లు, ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్లు, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాద్లో 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా? తదితర వివరాలు బయటపడతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్లో అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు ఉన్నత హోదాల్లో ఉన్నారు. వీరిలో భోపాల్కు చెందిన మహ్మద్ సలీమ్ హైదరాబాద్లోని ఓ మెడికల్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడు. ఒడిశాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్గా, షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. వీరితోపాటు అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ హమీద్ రోజువారీ కూలి. శామీర్పేటకు చెందిన మహమ్మద్ సల్మాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భోపాల్లో అరెస్టయిన మహమ్మద్ వసీమ్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అతని తండ్రి భోపాల్ గ్యాస్ బాధితుల కోసం పనిచేశారని పోలీసులు చెప్తున్నారు.
ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాప్తి చేస్తున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కంటే హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థ ప్రమాదకరమైన ఉగ్రవాద సమూహంగా మారింది. ఈ సంస్థకు 50 దేశాల్లో మద్దతు ఉన్నది. విదేశాల్లో ఈ సంస్థకు ప్రత్యేక సాయుధ విభాగం ఉన్నది. వీరు రసాయన, బ్యాక్టీరియా, జీవ సంబంధమైన యుద్ధంలో తన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్లోని జెరూసలేం 1952లో ఈ సంస్థను స్థాపించారు. లండన్లో దీనికి ప్రధాన కార్యాలయం ఉన్నది. ఈ సంస్థ యూరప్, మధ్యఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి ఇండోనేషియాలో శాఖలను కలిగి ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఇది గొప్ప ప్రభావాన్ని చూపెడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.