నిర్మల్, జూలై 5 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ చెప్పారు. బాసర ట్రిపుల్ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రూ.16 కోట్లతో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ప్రాధాన్యక్రమంలో పనులు పూర్తి చేస్తామన్నారు. 1,500 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా కొత్త మెస్ను ప్రారంభించినట్టు తెలిపారు. మెస్ నిర్వహణ బాధ్యతలను సమర్థులకు అప్పగిస్తామని వెల్లడించారు.
విద్యార్థుల కోరిక మేరకు 24 గంటలపాటు లైబ్రరీని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ ముషారఫ్ అలీ చెప్పారు. దాదాపు రూ.30 లక్షలు వెచ్చించి కొత్త పుస్తకాలను లైబ్రరీకి తీసుకొస్తామని చెప్పారు. 1,450 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను ఇప్పటికే అందజేసినట్టు తెలిపారు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్ను రూపొందించి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామని చెప్పారు. విద్యార్థులకు బీమా కల్పించడానికి చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు.