హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. తాజాగా 1,540 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులన్నింటికీ ఒకేసారి ప్రకటన ఇచ్చింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు, ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సైతం పెద్దపీట వేసింది.
1,540 ఉద్యోగాల్లో సాగునీటిపారుదలశాఖలోనే 704 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించే లక్ష్యంతో సర్కారు తీసుకొచ్చిన మిషన్ భగీరథ కోసం 302 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15 నుంచి www.tspsc.gov.inలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఏప్రిల్లో సీఎం కేసీఆర్ ప్రకటించగా కేవలం ఐదు నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 19,359 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి.
ప్రస్తుతం ఇచ్చిన 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులతో కలిపి ఆ సంఖ్య 20,899కి చేరింది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది.
‘ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీ 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో చదివి ధైర్యంగా పరీక్ష రాయండి. ఇంజినీరింగ్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్’ అంటూ ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్చేశారు.