హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కేంద్రం కక్ష సాధింపుతో.. నెలన్నరగా రాష్ట్రంలో మిల్లింగ్ ఆగిపోయింది. కేంద్రం కక్ష సాధింపుతో.. రూ.1,500 కోట్ల విలువైన ధాన్యం నీళ్ల పాలైంది. కేంద్రం కక్ష సాధింపుతో.. బియ్యంగా మారాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పుడా ధాన్యం.. మిల్లుల్లోనే మొలకెత్తుతున్నది! ఆ ధాన్యపు గింజలన్నీ వరి నారును తలపిస్తున్నాయి!! రాష్ట్రంలోని ఏ మిల్లులో చూసినా ఇదే దుస్థితి. ఈ పాపం ఎవరిది? ఇంతటి దారుణ పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే అన్ని వేళ్లు కేంద్రం వైపే చూపిస్తున్నాయి. నెలన్నర నుంచి రాష్ట్రంలో కేంద్రం మిల్లింగ్ను బంద్ చేసింది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సీఎమ్మార్ (బియ్యం) తీసుకోకుండా సతాయిస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతున్నది. సుమారు రూ.22 వేల కోట్ల విలువైన 92 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే కుప్పలుగా పేరుకుపోయింది. భారీ వర్షాలు పడటంతో మిల్లుల్లోని సుమారు 5-8 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు అంచనా. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అధిక మొత్తంలో ధాన్యం తడిసింది. ఈ ధాన్యం విలువ రూ.1,500- 2 వేల కోట్ల వరకు ఉంటుంది. మొలకెత్తిన ఈ ధాన్యం ఏ మాత్రం మిల్లింగ్కు పనికిరాదని మిల్లర్లు చెప్తున్నారు. దీన్ని బియ్యంగా మార్చడం సాధ్యం కాదని అంటున్నారు. ఈ ధాన్యాన్ని పశువుల దాణా కోసం లేదా బీర్ల తయారీకి మాత్రమే ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని వేలం వేయాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నెలన్నర నుంచి కేంద్రం సీఎమ్మార్ ఆపింది. దీంతో ధాన్యం మిల్లుల్లోనే నిల్వ ఉండిపోయింది. కొన్ని చోట్ల ఆరు బయట నిల్వ చేశారు. కానీ, ఊహించని రీతిలో భారీ వర్షాలు రావటంతో ధాన్యం వర్షార్పణం అయ్యింది. ఒకవేళ కేంద్రం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా యథావిధిగా సీఎమ్మార్ను తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ వైపు కేంద్రం సీఎమ్మార్ నిరాకరిస్తుండటం, మరోవైపు వర్షాలకు ధాన్యం తడుస్తుండటంతో ఏం చేయాలో తెలియక మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధీనంలోని ధాన్యం తడుస్తుండటంతో తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. మిల్లుల్లో ఉన్న ధాన్యానికి నిబంధనల ప్రకారం మిల్లర్లు బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ధాన్యం తడుస్తుండటంతో ఈ నష్టాన్ని ఎవరు భరించాలని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎమ్మార్ తీసుకోకుండా నష్టానికి కారణమైన కేంద్రమే దీన్ని భరించాలని, ఆ మేరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.