నల్గొండ : దేశంలో ఎక్కడా లేనివిధంగా మునుగోడులోనే 15శాతం మంది దివ్యాంగులున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపమంతా గత పాలకులదేనని ఆరోపించారు. ఈ ప్రాంత బిడ్డలు ఫ్లోరైడ్ రక్కసితో అవిటివారిగా మారినా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన బుధవారం నూతన పెన్షన్ లబ్ధిదారులకు కార్డులు అందేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 40లక్షల మందికి సీఎం కేసీఆర్ పెన్షన్ అందిస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో నియోజకవర్గంలోని నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ బాధితులను చూసి సీఎం చలించిపోయారన్నారు. పాలకులు పట్టించుకోకపోతే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ పెరిగి జనాలు లేని నియోజకవర్గంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి హెచ్చరించిందని, స్వరాష్ట్రం ఏర్పాటు కావాలని కేసీఆర్ భావించారని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని నియోజకవర్గంలోని చౌటుప్పల్ నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఆరేళ్లలోపే ఫ్లోరైడ్ సమస్యను లేకుండా చేశారన్నారు.
పారమెంట్ సాక్షిగా మునుగోడులో కొత్త ఫ్లోరైడ్ బాధితులు లేరని పేర్కొనడం సీఎం సాధించిన విజయమేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి, నియోజకవర్గంలో 40వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.