నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో మాక్లూరు మండలం చిన్నాపూర్ గండి వద్ద జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. వరంగల్ ఒకటో డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ను నిజామాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల్లోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని మాక్లూరు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.