Rain Update | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఈ నెల 25 నుం చి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్ నుంచి వెనుతిరుగుతాయని వెల్లడించింది. ఈ ప్రభావంతో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.
మరో మూడు రోజులు వానలు
అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన
గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్తోపాటు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో వాన దంచికొట్టింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకస్మాత్తుగా గోడకూలి మోరె పెద్దసాంబయ్య, సారక్క, జోగమ్మ మృతిచెందారు.