హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కంటివెలుగు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు 15 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె ‘కంటివెలుగు’ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కంటి వెలుగును లాంఛనంగా ప్రారంభిస్తారని, ఇందుకు సర్వసన్నద్ధం చేయాలని సూచించారు.
2018లో నిర్వహించిన తొలివిడత కంటివెలుగు కన్నా ఎకువ మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. మన రికార్డును మనమే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని కోరారు. కంటివెలుగుపై ప్రతి ఇంటికి, ప్రతి ఒకరికీ తెలిసేలా విసృ్తత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. క్యాంపులకు వచ్చేవారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలను అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శాంతికుమారికి శుభాకాంక్షల వెల్లువ
కొత్త సీఎస్ శాంతికుమారికి పలు ఉద్యోగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ్, రాష్ట్ర టీజీవో అసోసియేషన్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధ్యక్షుడు నరహరిరావు, ప్రధానకార్యదర్శి రాంచందర్, మహేశ్కుమార్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, టీఎన్జీవో నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, విక్రమ్, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, శ్రీరామ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.