సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): కూలీ పని ఉందని తీసుకెళ్లాడు.. ఆపై కల్లు, మద్యం తాగించాడు.. మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెను హత్యచేసి.. ఆమె ఒంటిపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పాత మహబూబూనగర్ జిల్లా , దామరగిద్ద మండలం, కంసాని పల్లి గ్రామానికి చెందిన గంజి వెంకటేశ్ జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి.. గోల్కొండ ప్రాం తంలోని గుల్షన్ కాలనీలో కొన్నేండ్లుగా నివాసముంటూ.. మేస్త్రీ పని చేస్తున్నాడు.
మణికొండలోని లేబర్ అడ్డా నుంచి కూలీలను తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో పనులు చేయిస్తుంటాడు. అయితే.. పనిలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నా డు.. ఇందులో భాగంగా.. ఈ నెల 9న మణికొండ లేబర్ అడ్డాలో కాళ్లకు వెండి కడియాలు, బంగారు చెవు రింగులు, ఒంటిపై ఆభరణాలతో బూనేటి చెన్నమ్మ అనే మహిళ కన్పించింది. ఆమె వద్దకు వెళ్లి.. మాదాపూర్లో పని చేయడానికి ఆడ మనిషి కావాలని.. వస్తావా అని అడుగగా ఆమె ఒప్పుకుంది. దీంతో వెంకటేశ్ ఆమెను తీసుకొని కొద్ది దూరం వెళ్లి.. ఆమెను ఒక దగ్గర నిల్చోబెట్టి కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చాడు.
పని లేదని చెప్పడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే కల్లు తాగిపోదామంటూ అని రాయదుర్గం ప్రాంతంలో కల్లుకాంపౌండ్లో కల్లు తీసుకొని, మార్గ మధ్యలో మద్యం కొన్నాడు. షేక్పేట్ ప్రాంతంలోని సక్కుబాయ్ గ్రేవ్యార్డు వద్ద మద్యం సేవించారు. ఆమెకు ఎక్కువ తాగించగా.. చెన్నమ్మ మత్తులోకి జారుకున్న తరువాత ఆమె తలపై రాడ్తో కొట్టి..ఆపై హత్య చేసి.. ఒంటిపై ఉన్న ఆభరణాలను అపహరించాడు.
మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ మండలానికి చెందిన చెన్నమ్మ, హన్మం తు దంపతులు నగరానికి వచ్చి గోల్కొండ, గుల్షన్ కాలనీలో ఉంటూ కూలీ పనిచేసుకుంటున్నారు. ఈనెల 9న కూలీ పని కోసం వెళ్లిన చెన్నమ్మ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త నార్సింగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో శ్మశాన వాటికలో మహిళ మృతదేహం కన్పించడంతో గోల్కొండ పోలీసులు, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించి.. హత్యకు పాల్పడింది వెంకటేశ్గా గుర్తించి, బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 60 తులాల వెండి కడియాలు, ఐదు గ్రాముల బంగారు చెవిరింగులు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వెస్జ్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.