హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీలకు విడుదలచేసే నిధులపై గ్రామ ప్రజలు, పంచాయితీ నిర్ణయం తీసుకొని ఖర్చుచేసుకునే వీలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తద్వారా ఇకపై స్థానిక అవసరాల మేరకు నిధులను వెచ్చించే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 142 మున్సిపాలిటీలు, నగరాల్లో కూరగాయలు, మాంసం, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల సాధికారతకు ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. సమీకృత మార్కెట్లు మహిళలకు అందుబాటులో ఉండేలా తగిన విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని స్పష్టంచేశారు.
గ్రామాల్లో, పట్టణాల్లో ఇండ్ల మీదుగా పోయే విద్యుత్ లైన్లను ప్రభుత్వఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావును ఆదేశించారు. నూతన జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇందుకు సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్రెడ్డికి ఫోన్చేసి ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ పోలీస్స్టేషన్తో కూడిన అదనపు పోలీస్స్టేషన్లు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. మహిళా పోలీస్ విభాగాలు ఏర్పాటుచేయాలని, ఇందుకోసం విధి విధానాలు ఖరారుచేసి ఉత్తర్వులు జారీచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించి, ఆయా నియోజకవర్గాల పరిధిలో పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంజూరుచేశారు.
ఎమ్మెల్యేల విన్నపం.. సీఎం సానుకూలం
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తేగా, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. పాత, కొత్త పనులకు అనుమతులను మంజూరుచేశారు. రైల్వే లైన్లు ఉన్న పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా ఆర్వోబీలు, అండర్పాస్ల నిర్మా ణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, నదులు కాల్వల మీద అవసరమైన చోట చెక్డ్యామ్ల నిర్మాణం వంటి పనులను మంజూరుచేయించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాం తాల్లో ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపాలని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు యాసంగి పంటల కోసం ఆయా ప్రాజెక్టుల కింద నీటిని విడుదలచేయించారు. కొల్లాపూర్ పరిధిలో యాసంగి పంటకు నీరివ్వాలని ఎమ్మెల్యే కోరగా, తగుచర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డిని ఆదేశించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అభ్యర్థన మేరకు నియోజకవర్గం పరిధిలోని పొలాలకు తక్షణమే నీరును విడుదల చేయాలని కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లను సీఎం ఆదేశించారు.
అధికారులు వెంటనే ఎస్సారెస్పీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదలచేశారు. దీంతో పెద్దపల్లి జిల్లా సహా మంథని మం డలంలోని ఎక్లాస్పూర్ వరకు, ఓదెల కాల్వ శ్రీరాంపూర్ చివరి ఆయకట్టు వరకు యాసంగి పంటకు సాగునీరు అందనున్నది. నకిరేకల్, మానకొండూరు, వరంగల్, నర్సంపేట, కొడంగల్, జగిత్యాల, దేవరకద్ర, గద్వాల, కోరుట్ల, కొల్లాపూర్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని పెండింగ్, నూతన అభివృద్ధి పను ల మంజూరుపై సీఎం సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నవీన్కుమార్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, విద్యాసాగర్రావు, పెద్ది సుదర్శన్రెడ్డి, రవిశంకర్, హర్షవర్ధన్రెడ్డి, భూపాల్రెడ్డి, మదన్రెడ్డి, గంప గోవర్ధన్, అబ్రహం, సంజయ్కుమార్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కాలె యాదయ్య, హన్మంత్ షిండే, పట్నం నరేందర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రసమయి, జైపాల్యాదవ్, సండ్ర వెంకటవీరయ్య, కృష్ణమోహన్రెడ్డి, సీఎం కార్యదర్శులు భూపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.