హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య సేవలందిస్తున్న స్టేట్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) డిస్పెన్సరీలను మరికొన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో త్వరలో ఆయా జిల్లాల్లో 14 డిస్పెన్సరీలను ప్రారంభించనున్నది. మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హనుమకొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఒక డాక్టర్.. మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట సహా 8 జిల్లాల్లో ఇద్దరు డాక్టర్లు, వరంగల్లో ముగ్గురు డాక్టర్లను నియమించి డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు.
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన 12వ ప్రాంతీయ బోర్డు సమావేశం బుధవారం హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఈఎస్ఐకి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికుంట, రామగుండంలో 100 పడకల చొప్పున దవాఖానల నిర్మాణానికి ఈఎస్ఐసీ నుంచి అనుమతి లభించిందని, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. నాచారం ఈఎస్ఐ దవాఖానలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాల ఏర్పాటుకు అనుమతి వచ్చిందని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కోరారు. అత్యవసర సేవల కోసం కార్పొరేట్ దవాఖానలు ఈఎస్ఐ కార్డులను అమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఇన్పేషెంట్ రోగులకు నిమ్స్, ఎంఎన్జే దవాఖానల్లోని అత్యవసర విభాగాల్లో వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సహకరించేలా లైజన్ అధికారి నియామకంతోపాటు ఆయన్ను సంప్రదించేందుకు హెల్ప్లైన్ (040-67872014) ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎస్ఈఎస్ రాణికుముదిని, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.