హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలకు పాల్పడుతున్న వేర్వేరు ముఠాలను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులమని.. కేబీసీ లాటరీ వచ్చిందని.. ప్రముఖుల ఫొటోలను వాట్సప్ డీపీలుగా పెట్టి మోసాలకు పాల్పడుతున్న 3 ముఠాల్లోని 14 మందిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, బెంగళూరులో పట్టుకొన్నారు. వీరిలో యువతులు కూడా ఉన్నారు. వీటిలో ఓ ముఠా దేశవ్యాప్తంగా 101, తెలంగాణలో 18 నేరాలకు పాల్పడినట్టు సీసీఎస్ జేసీపీ గజారావు భూపాల్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఎస్బీఐ అధికారులమంటూ..
ఈ ఏడాది మే నెలలో కొందరు వ్యక్తులు ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామంటూ కంచన్బాగ్లోని ఓ మహిళకు ఫోన్ చేశారని, రివార్డు పాయింట్లను క్యాష్ చేసుకోవాలని నమ్మబలుకుతూ ఆమె నుంచి క్రెడిట్కార్డు నంబర్, సీవీ, ఓటీపీ వివరాలు తీసుకొని మూడు దఫాలుగా లక్ష రూపాయలు కాజేశారని జేసీపీ వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ కాల్ సెంటర్పై దాడిచేసి దాని నిర్వాహకుడు నీరజ్కుమార్తోపాటు రోహిత్కుమార్, ఆకాశ్కుమార్, అజయ్ సింగ్, ప్రగ్యా టాండన్, సచిన్ వైష్ణవి, హిమాన్షి కటేరి, రాధిక ధామిజ, ప్రియాంకా శర్మ, ప్రీతీకుమారి సిన్హాను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరందరినీ హైదరాబాద్లోని కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.
అధికారుల ఫొటోలను వాట్సప్లో డీపీగా పెట్టి..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సప్లో డీపీలుగా పెట్టి అమాయకులను మోసగిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు జేసీపీ వెల్లడించారు. వీరిలో బెంగళూరుకు చెందిన యానిమేషన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాఘవ్, బీహార్కు చెందిన మరో విద్యార్థి ఆనంద్కుమార్ ఉన్నట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసిన అధికారుల ఫొటోలను డీపీగా పెట్టి.. అమెజాన్ గిఫ్ట్ కార్డులు, ఓచర్ల పేరిట కింది స్థాయి అధికారులను మోసగిస్తున్నట్టు వివరించారు.
రూ.25 లక్షల లాటరీ వచ్చిందంటూ..
రూ.25 లక్షల కేబీసీ (కౌన్ బనేగా కరోడ్పతి) లాటరీ వచ్చిందంటూ గత ఏడాది అక్టోబర్లో ఖైరతాబాద్లోని మహిళకు వివిధ రకాల ఫీజుల పేరిట రూ.39 లక్షలు కాజేసిన వ్యవహారంలో బీహార్కు చెందిన రాకేశ్కుమార్ను అరెస్టు చేసినట్టు జేసీపీ వెల్లడించారు. హెల్పర్గా పనిచేస్తున్న అతని నుంచి 16 ఫోన్లు, 30 సిమ్కార్డులు, 76 డెబిట్కార్డులు, 11 బ్యాంకు పుస్తకాలు, చెక్బుక్స్ను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ రమేశన్, వెంకట్రామిరెడ్డి, ఎస్సైలు నరేశ్, మధుసూదన్రావు, రామిరెడ్డి పాల్గొన్నారు.