హైదరాబాద్, నల్లగొండ, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/మునుగోడు: ‘నమ్ముకొన్న బర్రె పగిలిపోయిన కుండెడు పాలిచ్చినట్టు’.. తయారైంది నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టు మారింది అదే జిల్లా బీజేపీ గతి!! దీంతో మరో దారి లేని పార్టీల శ్రేణులకు ఒక్క టీఆర్ఎస్ మాత్రమే గమ్యస్థానంగా కనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి రాజీనామా అనంతరం టీఆర్ఎస్లో చేరేందుకు నేతలు క్యూ కడుతుండటం స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో నిరాశతోపాటు ఆగ్రహం, అసహనం కట్టలు తెంచుకొంటున్న పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇంతకాలం రాజగోపాల్రెడ్డి వెంట ఉన్నందుకు తాము మోసానికి, వంచనకు గురయ్యామని రగిలిపోతున్న ఆయన అనుచరులు.. ఆయన బీజేపీలోకి వెళ్లడంతో హతాశులవుతున్నారు.
నల్లగొండ జిల్లాల్లో బీజేపీ ఎక్కడున్నది? ఆయన ఆ పార్టీలోకి వెళ్లుడేంది? మమ్మల్ని ముంచుడేంది? అంటూ కాంగ్రెస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆగ్రహోదగ్రులవుతున్నట్టు తెలిసింది. రాజగోపాల్రెడ్డి సొంత వ్యాపారాల కోసం, స్వలాభం కోసమే బీజేపీలోకి వెళ్లారని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తున్నది. ఇకపై ఆయనకు సహకరించినా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కృత నిశ్చయానికి వచ్చినట్టు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్సే జయకేతనం ఎగురవేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న అక్కడి నేతలు.. రాజగోపాల్రెడ్డి వెంట వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తును, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అనేకమంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఆదివారం ఒక్కరోజే మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో నల్లగొండలో, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో పదుల సంఖ్యలో కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు.
జెండా కూడాలేని బీజేపీని గెలిపించాలా?
నల్లగొండ జిల్లాలో బీజేపీకి జెండా మోసే కార్యకర్తలు కూడా లేరు. మునుగోడు నియోజకవర్గంలో ఆ పార్టీ ఉనికే కనిపించదు. ఇలాం టి పరిస్థితుల్లో రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లాడన్న ఒకే ఒక్క కారణంతో తామంతా ఆ పార్టీకోసం ఎందుకు పనిచేయాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాజగోపాల్రెడ్డికి మునుగోడు నియోజకవర్గంతో సంబంధమే లేదు. గత ఎన్నికల్లో ఎమ్మె ల్యే టికెట్ వచ్చే ముందు వరకు కూడా ఆయన ఆ ప్రాంతానికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయినా, కాంగ్రెస్ అభ్యర్థి అన్న ఒకే ఒక్క కారణంతో ఆయనను గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు.
తనను గెలిపిస్తే నియోజవర్గంలోనే ఉండి అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్రెడ్డి చెప్పిన మాటలను నమ్మి ఆయన గెలుపునకు కిందిస్థాయి నేతలు శక్తివంచనలేకుండా కృషిచేశారు. కానీ, తాము మోసపోయామని తెలుసుకొనేందుకు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంతోకాలం పట్టలేదని చాలామంది కాంగ్రెస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తంచేశారు. కాం ట్రాక్టర్ అయిన రాజగోపాల్రెడ్డి ఎన్నడూ నియోజవర్గానికి రాలేద ని, ఏదైనా పని ఉండి ఎమ్మెల్యేను కలువాలని ప్రయత్నించినా అందుబాటులోకి వచ్చేవారు కాదని అంటున్నారు. అలాంటి వ్యక్తి కోసం ఉనికిలో లేని పార్టీని నెత్తిన మోయాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్తున్నారు.
మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరి, ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సరైన బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ఓటర్లు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనని చెప్పారు. జగదీశ్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆదివారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కారు అసమర్థ పాలన, బీజేపీ మతఛాందస విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. బీజేపీపై పోరాటంలో అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలంటున్న వామపక్షాలు కూడా టీఆర్ఎస్తో కలిసి రావాలని సూచించారు. గల్లీ లీడర్ అయిన బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే వీధిరౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈడీలకు, బోడీలకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం కాంగ్రెస్ ఎంపీటీసీ శివరాత్రి కవితావిద్యాసాగర్, మునుగోడు మండలం పులిపలుపుల ఎంపీటీసీ బొల్గూరి లింగయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
రాజగోపాల్రెడ్డిని ఓడించండి: మధుసూదనాచారి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్ నేత కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మా ట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు.