హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలి, కొవిడ్తో వచ్చిన మార్పులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్, మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కొవిడ్ తర్వాత రాష్ట్రంలో రక్తపోటు, మధుమేహ బాధితుల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లో వెల్లడైంది. రాష్ట్రంలో 30 ఏండ్లు పైబడిన వారందరికీ క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్కేర్ (సీపీహెచ్సీ) పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.05 కోట్లమంది (ఎన్సీడీ)కి ఎన్రోల్ చేసుకోగా.. 90 లక్షల మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు వెల్లడైన గణాంకాల ప్రకారం.. 14.4శాతం మంది హైపర్టెన్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
సుమారు 6.6 శాతం మంది డయాబెటీస్ బారిన పడినట్టు తేలింది. కొవిడ్కు ముందుతో పోల్చితే బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017-19 మధ్య దశలవారీగా నిర్వహించిన ఎన్సీడీ స్క్రీనింగ్లో మొత్తం 12 శాతం మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్టు తేలింది. తాజాగా ఈ సంఖ్య 14.4 శాతానికి పెరిగింది. గతంలో మధుమేహ బాధితులు 5.33 శాతం మంది ఉండగా.. ఈసారికి ఏకంగా 6.6 శాతానికి చేరింది. కొవిడ్ సమయంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం, వర్క్ ఫ్రమ్ హోంతో జీవనశైలిలో మార్పులు, ఆహార అలవాట్లలో మార్పు, ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక నష్టాల వల్ల ఒత్తిడి వంటి కారణాలతో బాధితుల సంఖ్య పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు.
ప్రత్యేకంగా ఎన్సీడీ క్లినిక్లు
ఎన్సీడీ స్క్రీనింగ్లో గుర్తించిన బాధితులను పీహెచ్సీకి రెఫర్ చేస్తున్నారు. అక్కడ వైద్యులు వారిని పూర్తిగా పరీక్షించి, చికిత్స అందిస్తున్నారు. అవసరమైన మందులను అందజేస్తున్నారు. తీవ్రత ఎక్కువ ఉంటే తదుపరి చికిత్స కోసం పై దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు. మరోవైపు ఎన్సీడీ బాధితుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఎన్సీడీ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 26 జిల్లా స్థాయి ఎన్సీడీ క్లినిక్స్, 54 సీహెచ్సీ ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం 47 సీహెచ్సీ ఎన్సీడీ క్లినిక్లు పనిచేస్తున్నాయి.