హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో రాష్ట్రంలో కొత్తగా 130 ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. తన అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సీజీఎఫ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణ, వివిధ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని వివరించారు. రూ.37.34 కోట్లతో కొత్తగా 130 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. స్వరాష్ట్రంలో మొత్తంగా 2,378 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.598 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.225 కోట్లతో పనులు పూర్తి చేశామని చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి, చీఫ్ ఇంజినీర్ జీ సీతారాములు, ఎస్ఈ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్చకులకు మూడు రోజుల శిక్షణ
ఆగమశాస్త్ర విధివిధానాల ప్రకారం ఆలయాల్లో పూజలు నిర్వహించే అంశంపై రాష్ట్రంలోని 6,500 మంది ధూప దీప నైవేద్య అర్చకులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాల్లో శైవ, వీరశైవ, వైష్ణవ, గ్రామ దేవతల ఆలయాల్లో పాటించాల్సిన పూజా విధివిధానాలతోపాటు ప్రవర్తనా నియమావళిపై తగిన శిక్షణ ఇస్తారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆదివారం నుంచి 3వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లా శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించడం వల్ల సమాజ శ్రేయస్సు జరుగుతుందని, ఆశించిన ఫలితాలు సమకూరుతాయని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ధూప దీప నైవేద్య అర్చకులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.