ఖమ్మం : జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురుకులంలో గత రెండు రోజులుగా విద్యార్థులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ కొంత మంది విద్యార్థులకు పరీక్షలు చేయించారు.
ఈ క్రమంలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది గురుకులంలో ఉన్న అందరు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు.