హైదరాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖకు రూ. 126.21 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఈ నిధులను రిలీజ్ చేసింది.
దేవాదాయ భూముల పరిరక్షణకు ఫెన్సింగ్, ఇతర రక్షణ చర్యల కోసం కామన్ గుడ్ ఫండ్ కింద రూ. 86.25 కోట్లు, 2,676 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం నాలుగో త్రైమాసిక బడ్జెట్ నుంచి రూ.13,91,91,000, ఆర్థిక సంవత్సరం చివరి వరకు అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం మరో రూ. 26,05,00,000 విడుదల చేస్తూ విడివిడిగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆలయ భూముల పరిరక్షణ కోసం దేవాదాయ శాఖ అధికారులు పెద్దఎత్తున డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆక్రమణల నుంచి కాపాడిన భూములకు పకడ్బందీగా కంచె ఏర్పాటు చేస్తున్నారు.