హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సరంక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ఫోన్తోనే ఓరల్ క్యాన్సర్ (నోటి క్యాన్సర్)ను గుర్తించవచ్చని తేలింది. దీనిపై ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) అధికారులు తెలిపారు.
ఏఐ సాయంతో పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రముఖ చిప్ కంపెనీ ఇంటెల్ ఐఎన్ఏఐ పేరుతో ట్రిపుల్ ఐటీలో ఓ రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇందులో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నోటిలోని గాయాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతోపాటు మెషీన్ ల్యాంగ్వేజ్లను ఉపయోగించి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారని, దీని సాయంతో ఓరల్ క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని ఐఎన్ఏఐ సీఈవో కోనాల వర్మ వివరించారు. ప్రయోగ దశలో విజయవంతమైన ఈ విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్టు తెలిపారు.