హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గడిచిన ఏడేండ్లలో ఏకంగా 117 శాతం సాగు వృద్ధి జరిగింది. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020-21లో అది 1.35 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే ఏడేండ్లలో 72.52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగడం విశేషం. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్డ్యాంల నిర్మాణం వంటి కార్యక్రమాలు పం టల సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదం చేశా యి.
ఈ మేరకు సాగు వివరాలను రాష్ట్ర ప్రభు త్వం గురువారం వెల్లడించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏకంగా రూ.1.61లక్షల కోట్లు వెచ్చించింది. కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 3.87 లక్ష ల ఎకరాలు, జే చొక్కారావు దేవాదుల ద్వారా 5.58 లక్షల ఎకరాలు, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2.03లక్షల ఎకరాలు, కల్వకుర్తి ప్రాజెక్ట్ ద్వారా 4.24 లక్షల ఎకరాలు, జవహర్ నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. పాలమూరు-రంగారెడి, దేవాదుల ప్రాజెక్టుల పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే మరో 15.91 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మిషన్ కాకతీయ, చెక్డ్యాంలు
మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.5,349 కోట్లతో రాష్ట్రంలోని సుమారు 27 వేల చెరువులను, కుంటలను ప్రభుత్వం బాగు చేసింది. ఫలితంగా గడిచిన ఐదేండ్లలో 8.93 టీఎంసీల నీటిని నిల్వ చేసి 15.05 లక్షల ఆయకట్టుకు నీరందించింది. రూ.3,850 కోట్లతో 1,200 చెక్ డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 638 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. 562 చెక్ డ్యాంల పనులు చివరిదశలో ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్ కింద 20.35 లక్షల ఎకరాలు సాగవుతున్నది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విస్తారమైన వర్షాలతో గడిచిన ఆరేండ్లలో భూగర్భ జలమట్టం 4.14 మీటర్లు పైకి పెరిగింది.