SSC Exams | తండ్రి మరణించిన బాధలోనూ ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చదువుకు ఉన్న విలువ గురించి తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. శోకసంద్రంలోనూ పరీక్ష రాసేందుకు వచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణంలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
మోత్కూరు పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన కూరెళ్ల హర్షవర్దన్ పట్టణంలోని సెయింట్ ఆన్స్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి కూరెళ్ల ఎల్లయ్య గుండాల మండలం వస్తాకొండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను గుండెపోటుతో మరణించాడు.
మరోవైపు హర్షవర్దన్కు ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో తండ్రి చనిపోయాడన్న బాధలో ఉండి కూడా శోక సంద్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్ష అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెడతాడని కుటుంబసభ్యులు తెలిపారు. శోకసంద్రంలో ఉన్నప్పటికీ పదో తరగతి పరీక్షకు హాజరైన హర్షవర్దన్ను చూసి స్నేహితులు, ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకవైపు తండ్రి మరణించిన బాధ, మరోవైపు భవిష్యత్తు కోసం పరీక్ష రాయాల్సిన పరిస్థితి అందర్నీ కలిచివేసింది.