జగిత్యాల, మే 24 (నమస్తే తెలంగాణ): సర్కారు నిర్వాకమో, అధికారుల వేధింపులో తెలియదు గానీ 104 అంబులెన్స్ డ్రైవర్ హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగితో విధుల కోసం బైక్పై వెళ్లి కార్యాలయానికి తిరిగొస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి, సీపీఆర్ చేసి చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఆరునెలలుగా ప్రభుత్వం వేతనం ఇవ్వకపోవడం, దీనికి తోడు జగిత్యాల డీఎంహెచ్వో శ్రీధర్ వేధింపుల వల్లే మానసిక వేదనకు గురై గుండెపోటుతో చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు. వారి కథనం ప్రకా రం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మం డలం పెద్దాపూర్కు చెందిన రాజకుమార్ (52)కు 15 ఏండ్ల క్రితం వివా హం జరగ్గా, పదేండ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి జగిత్యాలలోని తన అక్క ఇం ట్లోనే ఉంటున్నాడు. 104 అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దానిపై వచ్చే ఆదాయంతోనే రాజకుమార్ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు 104 సిబ్బందికి రెగ్యులర్గా వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. డిసెంబర్ వరకు వేతనాలు సక్రమంగానే మంజూరయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అందని వేతనాలు
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 104 సిబ్బందికి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో రాజకుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుగున్నాడు. దీనికి తోడు కొన్నాళ్లుగా రాజకుమార్కు 104 డ్రైవర్ బాధ్యతలు కాకుండా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా, స్వీపర్గా పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో రాజకుమార్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. పలుసార్లు రాజకుమార్ జిల్లా వైద్యాధికారిని కలిసి తనకు డ్రైవర్ విధులు ఇవ్వాలని, సెక్యూరిటీ గార్డు, స్వీపర్ పనులు, మరుగుదొడ్లు క్లీన్ చేసే పనులు చేయడానికి మనసు అంగీకరించడం లేదని వాపోయాడు. 5 నెలలుగా వేతనాలు రాక, గార్డు, స్వీపర్ విధులు చేయలేక, రాజకుమార్ తీవ్ర క్షోభకు, ఒత్తిడికి లోనయ్యాడు. డీఎంహెచ్వో మూడు రోజులు వరుసగా డ్యూటీ చేయాలని ఆదేశాలివ్వడంతో రాజకుమార్ తీవ్ర వేదనతోనే విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే ఆయన అలసటకు గురై గుండెపోటు బారినపడి మృతిచెందాడని ఆయన బంధువులు, తోటి ఉద్యోగులు ఆరోపించారు.