కోదాడ టౌన్, జనవరి 7: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 102 కిలోల గంజాయిని గురువారం రాత్రి పట్టుకున్నట్టు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోదాడలోని రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఆరిఫ్, ఇర్షద్ ఖాన్, కిరణ్ రాంభావ్ దీపకె, వినయ్ శైలేశ్ మెశ్రామ్ ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొన్నారు. 5 నెలల క్రితం వీరికి మహారాష్ట్ర వాసి పటాన్ అలియాస్ సజ్జుతో పరిచయం ఏర్పడింది. ఈ నలుగురు ఈ నెల 6న విజయవాడ బస్టాండ్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి 8 బ్యాగుల్లో గంజాయిని ఇచ్చారు. వీరు గంజాయితో హైదరాబాద్ వస్తుండగా కోదాడలోని రామాపురం క్రాస్రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో దొరికారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. రూ. 20 లక్షల విలువైన 102.3 కిలోల గంజాయితోపాటు 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.