అదనంగా రెం డుకోట్ల గన్నీ సంచుల సేకరణ
ఇప్పటికే 75 లక్షల టన్నులు దాటిన కొనుగోళ్లు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి వస్తుండటంతో అందు కు తగ్గట్టుగా పౌరసరఫరాలసంస్థ చర్యలు చేపట్టింది. కొనుగోలుకు అదనంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించడంతోపాటు, రెండుకోట్ల గన్నీ సంచులను సమీకరించాలని నిర్ణయించినట్టు సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది యాసంగిలో 80లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 75 లక్షల టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. లక్ష్యానికి మించి సుమారు 5 లక్షల టన్నుల దాకా అదనంగా రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు లక్ష్యానికి అనుగుణంగా కేటాయించిన నిధులు, గన్నీ బ్యాగులు పూర్తి కావడంతో.. అదనంగా సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ ముందుగానే పౌరసరఫరాల సంస్థకు రూ.20 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీ కల్పించారు. గన్నీ బ్యాగుల కొరతను తీర్చేందుకు ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన జిల్లాల నుంచి అసవరమైన జిల్లాలకు గన్నీ బ్యాగులను తరలించాలని చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.